తాత నెహ్రూ, తల్లి ఇందిరా, తమ్ముడు సంజయ్ తో రాజీవ్ గాంధీ1944 ఆగస్టు 20న న్యూఢిల్లీలో జన్మించిన రాజీవ్ గాంధీ, ఢిల్లీలోని డోన్ బాస్కో స్కూల్ లో చదువుకున్నాడు.
అతను లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో యంత్ర ఇంజనీరింగ్ చదివాడు.
1968లో, సోనియా గాంధీని వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా జన్మించారు.
రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదు, అతను విమాన పైలట్గా పనిచేసేవారు. కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి శ్రీమతి ఇందిరా గాంధీకి మద్దతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. పిదప, 1983లో, అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1984 అక్టోబరు 31న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకులచే హత్యకు గురయ్యారు. అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. తదుపరి జనరల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగాడు. 1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు. అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు (PCC), పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు. మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ముగిసింది .
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం యొక్క ఘనత అతనికే చెందుతుంది. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు, శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు.