పార్వతి
పార్వతి హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి, అశోక సుందరి, జ్యోతి, మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
ప్రధాన కథ
[మార్చు]

వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12) లో ఉమ లేదా హైమవతి అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మముడు గురించిన జ్ఞానము తెలియజేసింది.[1] క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కథలు ఉన్నాయి.[2][3] పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.1. హిమవంతునికి మేరువుకూఁతురైన మనోరమయందు పుట్టిన రెండవ కొమార్తె. ఈమె యొక్క అక్క గంగాదేవి. తొలిజన్మమున ఈమె దక్షుని కూఁతురు అయిన ఉమాదేవి. అపుడు తన తండ్రి అయిన దక్షప్రజాపతి చేసిన యజ్ఞమునకు తన భర్త అగు రుద్రుని పిలువక అవమానించెను అని అలిగి మహాకాళి స్వరూపమును వహించి అత్యాగ్రహమున దేహత్యాగముచేసి ఆవల పార్వతిగ పుట్టి రుద్రునికి భార్య అయ్యెను. ఈమె ఒకకాలమున రుద్రునితో కూడి ఉండఁగా దేవతలు ఆకూటమికి విఘ్నముచేసిరి. అందువలన వారికి స్వభార్యల యందు పుత్రసంతానము లేకుండునటుల ఈమె శపియించెను. మఱియు ఆకాలమునందు రుద్రునికి రేతస్సుజాఱి భూమియందు పడెను. భూమి దానిని ధరింపను ఓపక దేవతలసహాయమున అగ్నిని వాయువును వహించునట్లు చేయఁగా వారు ఆరేతస్సును హిమవత్పర్వత సమీపమున గంగయందు చేర్చిరి. అది కారణముగా గంగ గర్భము తాల్చి ఆగర్భమును భరింపలేక శరవణమునందు విడిచిపుచ్చెను. అందు కుమారస్వామి పుట్టెను. అతనికి షట్కృత్తికలు పాలిచ్చిరి కనుక కార్తికేయుఁడు అను పేరును, ఆపాలు ఆఱుముఖములతో ఒక్కతేపనె అతఁడు పానముచేసెను కనుక షణ్ముఖుఁడు అను పేరును అతనికి కలిగెను. స్ఖలితము అయిన రేతస్సువలన పుట్టినందున స్కందుఁడు అనియు అంటారు. ఇది కాక పార్వతి తన దేహమున కూడవలసిన తన భర్తయొక్క రేతస్సును భూమిధరించినందున భూమికి బహు భర్తలు కలుగునట్లు శాపము ఇచ్చెను. మఱియు గంగా నిర్గతమైన ఈసౌమ్యతేజము వలన సువర్ణము మొదలగు లోహములు కలిగినట్లును, ఆగంగానిక్షేపమువలన పొదలునట్టి సువర్ణ ప్రభల చేత తృణవృక్ష లతాగుల్మ ప్రభృతి ఉద్భిజ్జములు సువర్ణంబులు అయ్యెను అనియు పురాణములు చెప్పుచు ఉన్నాయి. వినాయకుడు, కుమారస్వామి వారి పుత్రులు.
శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం
[మార్చు]
అష్టోత్తర శతనామ స్తోత్రాలలో లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ అష్టోత్తర శతనామ స్తోత్రం నామావళి వలె ఉంటుంది. స్తోత్రం అనేది పద్యం అయితే, నామావళి పేరు పేరునా దేవుని పిలిచినట్లు ఉంటుంది. ప్రతి నామానికి ముందు ఓమ్ అనే ప్రణవ మంత్రం, చివర నమః అనే ఆత్మ సమర్పణా చరణం ఉంటాయి. మిగిలిన దేవతల నామావళిలో ఆత్మ సమర్పణా చరణమైన నమః ఒక సారి మాత్రమే ఉంటే,లలితా అష్టోత్తరంలో నమో నమః అని రెండు పర్యాయాలు వస్తుంది.[4]
ధ్యాన శ్లోకం
[మార్చు]సిన్దూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్
తారానాయక శేఖరాం స్మిత ముఖీం ఆపీన వక్షోరుహామ్
పాణిభ్యామళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిబ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామమ్బికామ్
పేర్లు, అవతారాలు
[మార్చు]
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిపుచ్చిన యమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
పార్వతికి ఎన్నోపేర్లు ఇంకెన్నో అవతారాలూ ఉన్నాయి.వాటిలో కొన్ని -
- హైమ - హేమ (బంగారం) వర్ణం కలిగింది
- అపర్ణ - పర్ణములు (ఆకులు) కూడా తినకుండా తపస్సు చేసింది.
- శాంభవి - శంభుని అర్ధాంగి
- భైరవి -
- భగమాలిని -
- మహిషాసుర మర్ధిని - మహిషుడు అనే రాక్షసున్ని సంహరించింది.
- బగళాముఖి -
- శివాణి, పరమేశ్వరి, ఈశ్వరి, మహేశ్వరి - ఈశ్వరుని అర్ధాంగి, సకల లోకాలకు అధిదేవత
- చాముండేశ్వరి - చండ, ముండులను సంహరించింది
- కాత్యాయని - గొప్ప ఖడ్గము ధరించింది
- ఉమ - బిడ్డా, తపమునకు పోవద్దని తల్లి మేనకచే పిలువబడినది
- దాక్షాయణి - దక్షుని బిడ్డ సతీదేవిగా అవతరించింది
- భవాని
- త్రిపుర సుందరి, లలిత, రాజరాజేశ్వరి, శ్రీదేవి
- బాల
- కామేశ్వరి - సకల కామితార్ధములను ప్రసాదించునది
- శతాక్షి, శాకంభరి - (దేవీ భాగవతంలోని కథలు)
- అంబిక - తల్లి
- దుర్గాదేవి, శక్తి,
- అన్నపూర్ణ
- కనకదుర్గ
- మాణిక్యాంబ
గ్రంధాలు, పురాణాలు
[మార్చు]దేవాలయాలు
[మార్చు]- శక్తిపీఠాలు
- శ్రీశైలం - భ్రమరాంబ
- మధురై - మీనాక్షి
- కంచి - కామాక్షి
- కాశి - అన్నపూర్ణ, విశాలాక్షి
- భద్రకాళీ దేవాలయము - వరంగల్
ఆచారాలు, పండగలు
[మార్చు]ప్రార్ధనలు, స్తోత్రాలు
[మార్చు]పార్వతిని, ఆమె అనేక రూపాలను స్తుతించే పెక్కు ప్రార్థనలు, స్తోత్రాలు, గేయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Kena Upanisad, III.11-IV.3, cited in Müller and in Sarma, pp. xxix-xxx.
- ↑ Kinsley p.36
- ↑ Kinsley p.37
- ↑ Team1, Omnamaha (2020-04-10). "శ్రీ లలిత దేవి అష్టోత్తర శత నామావళి". OmNamaha తెలుగు (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-11-29. Retrieved 2020-08-28.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)