అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)
అంగలూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశ రేఖాంశాలు: 16°23′10″N 81°02′16″E / 16.386062°N 81.037642°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | గుడ్లవల్లేరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,234 |
- పురుషులు | 2,102 |
- స్త్రీలు | 2,132 |
- గృహాల సంఖ్య | 1,248 |
పిన్ కోడ్ | 521330 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
అంగలూరు కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం లోని ఒక గ్రామం. పిన్ కోడ్ నం. 521 330., ఎస్.టి.డి.కోడ్= 08674.
గ్రామ చరిత్ర
[మార్చు]గామం పేరువెనుక చరిత్ర
[మార్చు]ఒక కథనము ప్రకారము ఈ ఊరు 12వ శతాబ్దము నుండి ఉంది. పూర్వము ఇక్కడ సైన్యము కొరకు అంగళ్లు ఉండటము వలన అంగళ్లూరు అని పేరు వచ్చింది. ఆంగళ్లూరు కాలక్రమేణా అంగలూరు అయినది. ఈ చిన్న గ్రామం అనేకమంది స్వాతంత్ర్యసమరయోధులను అందించింది.
గ్రామ భౌగోళికం
[మార్చు][1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు గుడివాడ నుండి మచిలీపట్నం వెళ్ళే రహదారిలో గుడివాడ నుండి 5 కి.మీ. దూరంలో ఈ వూరుంది.
సమీప గ్రామాలు
[మార్చు]గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం
సమీప మండలాలు
[మార్చు]హనుమాన్ జంక్షన్, గుడివాడ, పెడన, మచిలీపట్నం
గ్రామ సరిహద్దులు
[మార్చు]1913 ప్రాంతంలో బ్రిటీష్ కాలంలో గ్రామం సరిహద్దులు ఇలా వుండేవి- ఉత్తరంలో వేల్పూరు, గవర్నమెంట్ దింటకుర్రు, తూర్పున చెరువుపల్లి అగ్రహారం, చంద్రాల, దక్షిణాన గుడ్లవల్లేరు, వేముగుంట అగ్రహారం, పెంజెండ్ర, పడమర సేరికలవపూడి, రామచంద్రపురం. ఆయా గ్రామాల భూములు వేరుపడినట్టుగా సరిహద్దు పుంత అన్న సరిహద్దు ప్రాంతం చుట్టూ ఏర్పడివుంది. రెండు గ్రామాల సరిహద్దులు కలిసిన ప్రతిచోటా సరిహద్దు తెలిపేందుకు పూర్వం గచ్చుదిమ్మలు కట్టారు. అవి పగిలిపోయివుండడంతో వాటి స్థానములో బౌండరీస్టేషన్లు అన్న పేరుతో పెద్ద చదునైన నలుచదరపు కొండరాళ్ళు పాతారు.[2]
గామంలోని రవాణా సౌకర్యాలు
[మార్చు]బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు, మోటారు సైకిళ్ళు ఇతర ముఖ్య ప్రయాణ సాధనాలు.
గుడ్లవల్లేరు, గుడివాడ నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 51 కి.మీ
గామంలోని విద్యాసౌకర్యాలు
[మార్చు]ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల
[మార్చు]- చాలా కాలంనుండి (బ్రిటిష్వారి కాలం నుండి) ఉంది. బాలికలకు ఉన్నత పాఠశాల ఉండడం అప్పట్లో చాలా అరుదు. బహుశా కృష్ణా జిల్లాలో అప్పటికి ఇదొక్కటే ఈ విధమైన పాఠశాల కావచ్చును.
- ఈ పాఠశాలలో, 2013లో మంజూరయిన 15.90 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తికానున్నది. డిసెంబరు/2015 మొదటివారంలో ప్రారంభించెదరు. [13]
- ఈ పాఠశాల 70వ వార్షికోత్సవం 2016లో నిర్వహించుచున్నారు. [14]
శ్రీ లింగం వీరభద్రయ్య జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల
[మార్చు]ఈ పాఠశాల 57వ వార్షికోత్సవం 2016,ఫిబ్రవరి-22 న నిర్వహించారు. [15]
జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)
[మార్చు]శ్రీ సాయి ప్రతిభా స్కూల్, కొత్తపేట
[మార్చు]గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం
[మార్చు]ఈ కేంద్రానికి భవన నిర్మాణానికై, గ్రామంలోని మంచినీటి చెరువు ప్రక్కన ఉన్న పంచాయతీ స్థలాన్ని కేటయించారు. [12]
త్రాగునీటి సౌకర్యం
[మార్చు]ఈ గ్రామానికి చెందిన ఎన్.ఆర్.ఐ. విద్యార్థి శ్రీ శొంఠి ఫణిసాయి, 1.6 లక్షల వితరణతో ఏర్పాటుచేసిన నూతన త్రాగునీటి ట్యాంకరును, 2017,ఏప్రిల్-21న ప్రారంభించారు. [17]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]గ్రామానికి ముఖ్యమైన నీటివనరు కృష్ణా కాలువలు.
గ్రామ పంచాయతీ
[మార్చు]- ఈ గ్రామ పంచాయతీకి 80 ఏళ్ళ చరిత్ర ఉంది. [2]
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి బొర్రా వెంకటేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ త్రిపురనేని సురేశ్ ఎన్నికైనారు. [10]
- 2021 ఫిబ్రవరి లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శ్రీ మేడిపల్లి రవి, సర్పంచిగా శ్రీ టి. సురేశ్ ఉప సర్పంచి గా ఎన్నికైనారు.
- 12వ వార్డు ( కవిరాజనగర్ ) మెంబర్ గా శ్రీమతి కలపాల సలోమీ హోరాహోరీ పోటీలో గెలిచారు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
[మార్చు]శ్రీ అమరేశ్వరస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయాలలో స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి సందర్భంగా (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. [3]
శ్రీ సీతారామస్వామివారి అలయం
[మార్చు]ఈ ఆలయం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ ఆలయంలోని శ్రీ సీతారాముల విగ్రహం, రాష్ట్రంలోనే అత్యంత అరుదైనదిగా గుర్తింపు పొందినది. ఏకశిలగా శ్రీరాముని ఎడమ తొడపై సీతాదేవి కూర్చున్నట్లుగా ఉన్న విగ్రహం అరుదైనది. భద్రాచలం రామాలయంలో ఇలాంటి విగ్రహం ఉన్నా, అక్కడ ప్రక్కనే లక్ష్మణస్వామి విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలోని విగ్రహం సీతారాములిద్దరిదీ మాత్రమే కావడం విశేషం. దీనికి ప్రక్కనే ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. 2012 ఆగష్టులో 6 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించిన సందర్భంగా, దాత, సెంటినీ గ్రూపు ఛైర్మన్ శ్రీ త్రిపురనేని శేషగిరిరావు , మూలవిరాట్టు ఆకారంలోనే, ఉత్సవమూర్తి విగ్రహాన్ని, ఒక లక్ష రూపాయల వ్యయంతో, శ్రీలంక దేశంలో తయారు చేయించారు. దీనికి తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో నగిషీలు దిద్దించి, అక్కడే ప్రతేకపూజలు చేయించి, ఇక్కడ వైభవంగా ప్రతిష్ఠించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని, ఈ ఆలయంలో, 2015,మార్చి-21వ తేదీనాడు, పెద్ద యెత్తున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు నిర్వహించెదరు. [5]
శ్రీ సీతారామాలయం
[మార్చు]అంగలూరులోని ఒక పెంకుటింటిలో, 1925లో రామమందిరాన్ని ఏర్పాటుచేసారు. అందులో స్వామివారల మట్టి విగ్రహాలను ఏర్పాటుచేసి పూజించేవారు. ఈ మందిరం శిథిలావస్థకు చేరడంతో, గత సంవత్సరం దానిని తొలగించి, నూతన ఆలయ నిర్మాణం ప్రారంభించారు. స్థానిక శ్రీ ఙానసాయి ఆలయ నిర్మాణదాతలు శ్రీ యలమంచిలి నాగమోహన్, లక్ష్మి దంపతులు, ఆలయ నిర్మాణానికి వస్తుసామగ్రి అందజేసినారు. గౌడసంఘీయులు ఇచ్చిన విరాళాలతో, ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయినది. స్వామివారల రాతివిగ్రహాలను తిరుమలలో తయారుచేయించి తెచ్చారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,జూన్-9వ తేదీ మంగళవారంనాడు ప్రారంభించారు. మంగళవారంనాడు, అఖండస్థాపన, యాగశాల ప్రవేశం, దీక్షాధారణ, అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, గణేశ, నవగ్రహ హోమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 10వ తేదీ బుధవారం నాడు, వివిధపూజలు, హోమాలు నిర్వహించారు. 11వ తేదీ గురువారంనాడు, ఉదయం 6 గంటలనుండి, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశనం, రత్నన్యాసం, శిఖరస్థాపన, యంత్రస్థాపన, శ్రీ సీతా, లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ఠలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జవనాయసము, నేత్రమోక్షము, మహాకుంభాభిషేకం, ధేను విప్రకన్య దర్పణ, మహోధ్య, నవధాన్య దర్శనములు, పూర్ణాహుతి, అన్నసమారాధన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. [10]
శ్రీ ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయం
[మార్చు]శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]ఈ పురాతన, అరుదైన ఆలయాన్ని సప్తఋషులలో ఒకరైన విశ్వామిత్ర మహర్షి దర్శించుకున్నట్లు గ్రామస్తుల కథనం. ఇక్కడ స్వామివారి విగ్రహం, ఏకరీతిగా, ఆరడుగుల ఎత్తులో ఉంటుంది. స్వామివారు ఉత్తరముఖంగా దర్శనమిస్తారు. అరుదైన ఈ ఉత్తరముఖ ఆంజనేయస్వామివారి దర్శానం, సర్వపాప హరణం అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు పునర్నిర్మాణం అనంతరం, 105 సంవత్సరాల క్రితం, గ్రామంలోని దుగ్గిరాల వంశీకులు, ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. బొప్పన వంశీయులు ధ్యజస్తంభ ప్రతిష్ఠ, నిత్యార్చనకు చేయూతనిచ్చుచున్నారు. దుగ్గిరాల వంశీకులు, గ్రామస్థులు, 2013లో, పురాతన ఆలయాన్ని తొలగించి, నూతన ఆలయ పునర్నిర్మాణానికై, 2015,జనవరి-4వ తేదీనాడు, శంకుస్థాపన నిర్వహించారు. అప్పటినుండి 60 లక్షల రూపాయల వ్యయంతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినారు. 2015,మే నెల-25 నుండి, ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభించి, 28వ తేదీ గురువారం ఉదయం 8-29 గంటలకు స్వామివారి యంత్ర, రత్న, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, వాహన, బలిపీఠ ప్రతిష్ఠోత్సవాలు, మహాపూర్ణాహుతి, నేత్రోన్మలనము, గోపృష్ట దర్శనం, మాహాకుంభాభి నివేదన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. తదుపరి భారీ అన్నసమారాధన నిర్వహించారు. [6],[7]&[9]
ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించి 40 రోజులైన సందర్భంగా, 2015,జూలై-6వ తేదీ, సోమవారంనాడు, ఆలయంలో ఆచార సంప్రదాయాల ప్రకారం, మండల దీక్షా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. [11]
ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం 2017,జూన్-4వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. [18]
తాజుద్దీన్ బాబా, జ్ఞాన శాయి మందిరం
[మార్చు]మత సామరస్యం వెల్లి విరుస్తూ తాజుద్దీన్ బాబా, జ్ఞాన శాయి మందిరం ఒకే ప్రాంగణంలో, అరుదైన ఆధ్యాత్మిక కేంద్రం ఉంది.
గ్రామంలోని ప్రధాన పంటలు
[మార్చు]వ్యవసాయం పై ఆధారపడిన ఈ వూరిలో ప్రధానమైన పంట వరి.
గ్రామంలోని ప్రధాన వృత్తులు
[మార్చు]గ్రామ ప్రముఖులు
[మార్చు]- త్రిపురనేని రామస్వామి చౌదరి
- త్రిపురనేని గోపీచంద్
- దుగ్గిరాల రాఘవ చంద్రయ్య
- దుగ్గిరాల త్రివిక్రమరావు, మాజీ సర్పంచ్.
- త్రిపురనేని హనుమాన్ చౌదరి.
- యేజెళ్ళ శ్రీరాములు చౌదరి
- గొట్టిపాటి శివాజీ రావు స్వాతంత్ర సమరయోధులు
గ్రామంలోని విశేషాలు
[మార్చు]- ఈ గ్రామానికి చెందిన శ్రీ యలమంచిలి నాగమోహన్, గుంటూరు జిల్లాలో ఒక గుత్తేదారుగా విధులు నిర్వహించుచున్నారు. వీరి సతీమణి శ్రీమతి లక్ష్మి. వీరు 2010, నవంబరు-25నుండి, గ్రామంలో ఒక నిత్యాన్నదన పథకాన్ని నిరాటంకంగా నిర్వహించుచున్నారు. ఈ గ్రాములో నా అనేవారు ఎవరూ లేని అనాథలు, మంచంపై నుండి కదలలేక వంటగూడా చేసుకోలేని అశక్తులు, శారీరిక, మానసిక వికలాంగులైన 51 మందిని గుర్తించి, వారికి నిత్యం, రెండుపూటలకు సరిపడే అన్నం, కూర, పచ్చడి, చారు, సాంబారు పెరుగు కలిపిన అన్నం వగైరాలను, రుచికరంగా పరిశుభ్రమైన వంటశాలలో వండి, క్యారేజీలలో సర్ది, ఇంటింటికీ రిక్షాలద్వారా పంపించుచున్నారు. వీరికి సంవత్సరానికి రెండుసార్లు వస్త్రదానం చేయుటయేగాక, అనారోగ్యులకు వైద్య సేవలుగూడా అందించుచున్నారు. ఇంతేగాక, నెలకు నాలుగు గురువారాలలోనూ మరియూ ఒక రోజున తాజుద్దీన్ బాబా చందనోత్సవం రోజున, మొత్తం ఆరురోజులలలో గుడికి వచ్చే భక్తులకు వండిపెట్టే పులిహోర, ఒక తీపిపదార్ధం, 2,3 రకాల కూరలను గూడా క్యారేజీలలో సర్ది అన్నార్తులకు పంపుచున్నారు. ఈ నిత్యాన్నదాన పథకానికై రు. 60 లక్షల వ్యయంతో ఒక రెండస్థుల భవనాన్ని నిర్మించడమేగాక, ఖరీదైన హోటళ్ళలో ఉండేటటువంటి అత్యాధునిక వంటసామగ్రిని అందుబాటులో ఉంచారు. ఈ పనికోసం ఇద్దరు వంటవారు, ఒక రిక్షా, రిక్షాను తొక్కడానికి ఒక మనిషి, ఈ పనులపై అజమాయిషీ చేయడానికి ఒక సూపర్ వైజర్ వగైరాలను నియమించారు. ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించుచున్న శ్రీ యలమంచిలి నాగమోహన్, లక్ష్మి దంపతులు, అంగలూరులోని శ్రీ ఙానసాయి ఆలయ నిర్మాణ దాతలుగూడా. శ్రీ షిర్డీ సాయిబాబా సమకాలికులైన నాగపూర్ తాజుద్దీన్ బాబా శిష్యపరంపరలోని చీమలపాడు బాబా అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదర్ బాబా వారి ప్రేరణ, స్ఫూర్తి, సూచనలతోనే ఈ బృహత్ కార్యక్రమం చేపట్టినట్లు ఈ దంపతులు చెప్పుచున్నారు. [4]
- దుగ్గిరాల, త్రిపురనేని అనే ఇంటి పేరులు గల కుటుంబాలు ఈ వూళ్ళో చాలా కాలంగా ప్రముఖమైన స్థానం కలిగి ఉన్నారు.
- ఈ వూరివారయిన శ్రీ యెర్నేని జగన్మోహనరావుగారు హైదరాబాదులోని మధురానగర్లో "వృషామణి ఫౌండేషన్" స్థాపించారు. అమెరికాలో ఉంటున్న తన కుమారుడు చక్రధర్ ఆర్థిక సాయంతో ఆ ఫౌండేషన్ ద్వారా ప్రతిభావంతులయిన నిరుపేద విద్యార్థులకు విద్యాదానాన్ని అందించి వాళ్లలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు సహాయపడుచున్నారు. [1]
- ఈ గ్రామంలో శ్రీ నగిశెట్టి బ్రహ్మయ్యలింగం, శ్రీమతి కోటేశ్వరమ్మ అను దంపతులు, స్వాతంత్ర్య సమరయోధులు. ఆ రోజులలో మహాత్మా గాంధీ పిలుపుమేరకు, సమీప మోటూరు రైల్వే స్టేషను వద్ద అప్పట్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైలుపట్టాలను తొలగించిన కేసులో కారాగార శిక్ష అనుభవించారు. శ్రీ బ్రహ్మయ్యలింగం, కొద్దికాలం క్రితం కాలంచేసారు. శ్రీమతి కోటేశ్వరమ్మ, 2015,ం3-26వ తేదీనాడు కన్నుమూసినారు. ఈ దంపతులకు పిల్లలులేరు. [8]
- గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో జన్మించిన శ్రీమతి మూల్పూరు సరోజినీదేవి, బాపులపాడు మండలంలోని ఆరుగొలను గ్రామానికి చెందిన మూల్పూరు రామారావుని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడినారు. శ్రీమతి సరోజినీదేవి నూరు సంవత్సరాలు పూర్తి చేసుకొనడంతో, ఆమెను ఆమె వారసులు 2016,ఫిబ్రవరి-24న జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. [16]
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4542.[3] ఇందులో పురుషుల సంఖ్య 2233, స్త్రీల సంఖ్య 2309, గ్రామంలో నివాసగృహాలు 1159 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 16,234 - పురుషుల సంఖ్య 2,102 - స్త్రీల సంఖ్య 2,132 - గృహాల సంఖ్య 1,248
మూలాలు
[మార్చు]- ↑ "అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)". Retrieved 2 July 2016.
- ↑ అడవి, సాంబశివరావు పంతులు (1913). అంగలూరు గ్రామ భూగోళము (PDF) (1 ed.). దుగ్గిరాల: తిపిర్నేని రం.రామయ్య. p. 1. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 11 April 2015.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.
బయటి లింకులు
[మార్చు][1] ఈనాడు కృష్ణా జిల్లా ఆదివారం అనుబంధం; 2013,జూన్-9; 5వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014,మార్చి-31; 6వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,మే-15; 10వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,ఆగష్టు-1; 9వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015,మార్చి-28; 11వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,మే-19; 31వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,మే-27; 29వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,మే-28; 6వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,మే-29; 29వపేజీ [10] ఈనాడు అమరావతి; 2015,జూన్-12; 31వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015,జులై-6; 29వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2015,జులై-16; 30వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-3; 26వపేజీ. [14] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,ఫిబ్రవరి-22; 2వపేజీ. [15] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,ఫిబ్రవరి-23; 2వపేజీ. [16] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-25; 4వపేజీ. [17] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,ఏప్రిల్-22; 1వపేజీ. [18] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,జూన్-5; 2వపేజీ.