తెలుగు స్వతంత్ర
సాంఘిక రాజకీయ వారపత్రిక. తొలి సంచిక 1948, ఆగష్టు 6వ తేదీ వెలువడింది. ఖాసా సుబ్బారావు ఈ పత్రికకు సంపాదకుడు. మద్రాసు నుండి వెలువడింది. వెల పావలా. సాలు చందా 12/-[1]
![]() తెలుగు స్వతంత్ర | |
రకం | రాజకీయ సాంఘిక వారపత్రిక |
---|---|
రూపం తీరు | ఆక్టో డెమీ |
ప్రచురణకర్త | ఖాసా సుబ్బారావు |
సంపాదకులు | ఖాసా సుబ్బారావు |
సహ సంపాదకులు | గోరా శాస్త్రి |
స్థాపించినది | 1948 |
భాష | తెలుగు |
కేంద్రం | మద్రాసు |
ఆశయాలు
[మార్చు]ఈ పత్రిక తొలి సంపాదకీయంలో పత్రిక ఆశయాల గురించి ఈ క్రింది విధంగా తెలియజేయబడింది.
“తెలుగు స్వతంత్ర” ప్రజాజీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ పరిశీలించి, అవసరమైతే నిశితంగా విమర్శిస్తుంది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంతో తన కర్తవ్యం ముగిసిందని తలంచదు; ప్రజాభిప్రాయాన్ని ప్రగతి మార్గాన నడిపించడానికి ప్రయత్నిస్తుంది.
చరిత్ర
[మార్చు]ఈ పత్రికకు 1955 జూలై నుండి టి.ఇ.శ్రీనివాసన్ ప్రచురణకర్తగా, గోరా శాస్త్రి సంపాదకులుగా వ్యవహరించారు. 1957-58 ప్రాంతాలలో ఈ పత్రిక మూతబడింది. తెలుగు స్వతంత్రలో ప్రచురణ అయిన రచనలకు పారితోషికాలు రచయితలకు సరిగా ముట్టేవి కాదు. 1949-50 ప్రాంతంలో అప్పటికి ఔత్సాహిక రచయితగా ఉన్న భమిడిపాటి రామగోపాలం చాలా కథలు వ్రాశారు. ఆయనను ప్రోత్సహిస్తూ ఆయా కథలను ప్రచురించుకున్నారు తప్ప తెలుగు స్వతంత్ర పత్రికాధిపతులు పారితోషికం మాత్రం ఆయనకు ఇవ్వలేదు. కొన్నాళ్ల పాటు ఎదురుచూసిన భరాగో ఇక తాను వ్రాసిన కథలకు పారితోషికం ఇవ్వాలని నేరుగా అప్పటి తెలుగు స్వతంత్ర పత్రికా సంపాదకులు ఖాసా సుబ్బారావుకే నేరుగా ఉత్తరం వ్రాసి అడిగారు. ఆయనకు పారితోషికం ఇచ్చారు, అప్పటినుంచీ పారితోషికాల విషయంలో కొంత మెరుగైన స్థితి ప్రారంభమైంది. కానీ ఈ సంఘటన జరిగినాటి నుంచీ తెలుగు స్వతంత్ర పత్రికలో భరాగో వ్రాసిన రచనలు వేసుకోలేదు.[2]
శీర్షికలు
[మార్చు]- వినాయకుడి వీణ - గోరాశాస్త్రి
- యథాలాపం - ఖాసా సుబ్బారావు
- మ్యూజింగ్స్ - చలం
- ఘంటాపథం - విశ్వేశ్వర
- సామాన్యుడి సందేహాలు - సామాన్యుడు
- రాగం తానం పల్లవి - ఉమేష్
- పుస్తక సమీక్ష
- స్నేహలత
- తారాపథం
- జనవాక్యం
రచనలు
[మార్చు]ఈ పత్రికలో ఆరుద్ర రచించిన త్వమేవాహమ్, జి.వి.కృష్ణరావు వ్రాసిన కీలుబొమ్మలు మొదలైనవి వెలువడినాయి.
రచయితలు
[మార్చు]ఈ పత్రికలో హేమాహేమీలైన రచయితల రచనలు చోటుచేసుకున్నాయి. వారిలో కొద్దిమంది: అంగర వెంకటకృష్ణారావు, అందే నారాయణస్వామి, అక్కిరాజు రమాపతిరావు, అబ్బూరి ఛాయాదేవి, అవసరాల రామకృష్ణారావు, ఇచ్ఛాపురపు జగన్నాథరావు, ఇసుకపల్లి దక్షిణామూర్తి, ఉన్నవ విజయలక్ష్మి, ఎన్.ఆర్.నంది, శారద, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కె.రామలక్ష్మి, కొడవటిగంటి కుటుంబరావు, కొత్తపల్లి వీరభద్రరావు, కొమ్మూరి వేణుగోపాలరావు, గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి, గుడిపాటి వెంకటచలం, గోరాశాస్త్రి, ఎన్.ఆర్.చందూర్, కనక్ ప్రవాసి, చాగంటి సోమయాజులు, టేకుమళ్ల కామేశ్వరరావు, తురగా జానకీరాణి, తాళ్లూరు నాగేశ్వరరావు, దాశరథి కృష్ణమాచార్య, దాసరి సుబ్రహ్మణ్యం, నెల్లూరి కేశవస్వామి, నేలటూరి వెంకటరమణయ్య, పాలగుమ్మి పద్మరాజు, పి.శ్రీదేవి, బండి నారాయణస్వామి, బులుసు వేంకటరమణయ్య, భమిడిపాటి రామగోపాలం, భమిడిపాటి జగన్నాథరావు, బెల్లంకొండ రామదాసు, మల్లాది రామకృష్ణశాస్త్రి, రంగనాయకమ్మ, రంధి సోమరాజు, రావూరి భరద్వాజ, విశ్వనాథ సత్యనారాయణ, విద్వాన్ విశ్వం, శివరాజు వెంకట సుబ్బారావు, శ్రీరంగం శ్రీనివాసరావు, సింగీతం శ్రీనివాసరావు, చేకూరి రామారావు, ఆలూరి బైరాగి మొదలైనవారు.
ప్రముఖుల అభిప్రాయాలు, సమీక్షలు
[మార్చు]- ఆంధ్రపత్రిక ఈ పత్రిక తొలి సంచికను ఈ క్రింది విధంగా పరిచయం చేసింది.[1]
శ్రీ ఖాసా సుబ్బారావు గారు సంపాదించి ప్రచురించుచున్న సాంఘిక రాజకీయ వారపత్రిక తెలుగు స్వతంత్ర తొలిసంచికలో 48 పుటలలో 'ఘంటాపథం', 'జన వాక్యం' అను సార్షక శీర్షికలు, సాహిత్య, రాజకీయ వ్యాసములు, కథలు, గేయాలు, ఉటంకులు ఉన్నవి. సంపాదకీయమూ, శ్రీ ప్రకాశం పంతులుగారి సందేశమూ ఈ పత్రిక లక్ష్యములను వివరించుచున్నవి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 సంపాదకుడు (25 August 1948). "గ్రంథ పరిచయం 'తెలుగు స్వతంత్ర '". ఆంధ్రపత్రిక వారపత్రిక. 40 (50): 21. Retrieved 25 February 2025.
- ↑ అత్తలూరి, నరసింహారావు (మార్చి 1990). [[ఇట్లు మీ విధేయుడు]] (పదినిమిషాల్లో భరాగో పరిచయము వ్యాసం). విశాఖపట్టణం: విశాఖ సాహితి.
{{cite book}}
: URL–wikilink conflict (help)