ఆంధ్ర ప్రకాశిక
సంపాదకులు | ఎ.సి. పార్థసారథి నాయుడు |
---|---|
తరచుదనం | వార పత్రిక |
ముద్రించిన కాపీలు | 500 (1888 జనవరి) |
ముద్రణకర్త | ఎ.సి. పార్థసారథి నాయుడు |
మొదటి సంచిక | 1885 ఫిబ్రవరి |
దేశం | భారతదేశం |
కేంద్రస్థానం | మద్రాసు |
భాష | తెలుగు |
ఆంధ్ర ప్రకాశిక, మద్రాసు నగరం నుండి 19, 20 శతాబ్దాలలో వెలువడిన తెలుగు వార పత్రిక.
ఆంధ్ర ప్రకాశికను 1885 ఫిబ్రవరిలో ఎ.సి. పార్థసారథి నాయుడు మద్రాసులో వారపత్రికగా ప్రారంభించాడు.[1] అతను కాంగ్రెసువాది, దేశభక్తుడు. 25 సంవత్సరాల పాటు వారపత్రికగా నడిచి ఆ తరువాత వారానికి రెండుసార్లు వచ్చే పత్రికగా మారింది. కొద్దికాలానికే మళ్ళీ వార పత్రికగా మారింది. దాదాపు 42 సంవత్సరాల పాటు ఈ పత్రిక నడిచి, మూతపడింది.
చరిత్ర
[మార్చు]బ్రిటిషు ప్రభుత్వ అధికారులు నెలనెలా పంపే గోప్య నివేదికలో వివిధ పత్రికల సర్క్యులేషను సంఖ్యలతో పాటు, పరిపాలనకు సంబంధించి ఆయా పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన సామాజిక వార్తలు, విశేషాలను కూడా ఇంగ్లీషు లోకి అనువదించి పంపేవారు.[2] ఈ నివేదికల్లో 1885 మార్చి నివేదికలో దాని సర్క్యులేషను 500 ఉందని ఆ నెల రాసారు. ఆ నివేదికలో "ఆంధ్ర ప్రకాశిక అనే కొత్త పత్రిక తన 5 వ సంచికలో" ఇలా రాసింది అంటూ అది ప్రచురించిన ఒక వార్తను ప్రస్తావించారు. దీన్ని బట్టి ఈ వార పత్రిక 1885 ఫిబ్రవరిలో ఉద్భవించిందని తెలుస్తోంది.[2]
రచనలు
[మార్చు]పత్రికలో రాజకీయ వార్తలకు ప్రాధాన్యత ఉండేది. తెలుగులో వచ్చిన తొలి రాజకీయ వార పత్రిక అనీ, సాధారణ తెలుగు పాఠకులకు రాజకీయాలపై ఆసక్తి కలిగించిన పత్రిక అనీ వేదగిరి రాంబాబు పేర్కొన్నాడు.[3] ఆనాటి బ్రిటిషు ప్రభుత్వ విధానాలను పత్రికలో నిర్భీతిగా విమర్శించేవారు. సైన్యంలో జరిగే దౌర్జన్యాలపై ఈ పత్రికలో వార్తలు వచ్చేవి.[3] ఈ కారణంగానే, అప్పట్లో పత్రికల్లో పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన సామాజిక వార్తలు, విశేషాలను ఇంగ్లీషు లోకి అనువదించి పంపే గోప్య నివేదికల్లో ఈ పత్రిక ప్రస్తావన తరచూ వచ్చేది. ప్రసిద్ధ పాత్రికేయుడు సత్తిరాజు సీతారామయ్య ఈ పత్రిక ద్వారానే పత్రికారంగం లోకి ప్రవేశించాడు.
ప్రకటనలు
[మార్చు]ఆంధ్ర ప్రకాశికలో వ్యాపార ప్రకటనలు కూడా వచ్చేవి. కేసరి కుటీరం అధినేత కోట నరసింహం తన ఆత్మకథ చిన్ననాటి ముచ్చట్లులో, తన ఆయుర్వేద ఔషధానికి ఈ పత్రికలో ప్రకటన ప్రచురించేందుకు 5 రూపాయలు ఇచ్చానని రాసాడు.[4]
పత్రికపై సమీక్షలు
[మార్చు]ఆంధ్ర ప్రకాశిక పత్రికపై అప్పటి ప్రఖ్యాత పాత్రికేయుడు దంపూరు వెంకట నరసయ్య తన పీపుల్స్ ఫ్రెండ్ ఇంగ్లీషు పత్రికలో సమీక్ష రాసాడు. 1888 ఫిబ్రవరి 25 న వెలువడిన ఈ సమీక్షలో, మద్రాసు ప్రెసిడెన్సీలో వెలువడుతున్న ఈ తెలుగు వారపత్రికను, ఇంగ్లీషు వారపత్రికల పద్ధతిలో ప్రచురిస్తున్నారని రాసాడు. ఇంగ్లీషు రాని పాఠకులు ఈ పత్రిక ద్వారా దేశపరిస్థితులనూ, రాజకీయాలనూ తెలుసుకోవచ్చని రాసాడు. పాఠకులకు ఆసక్తి కలిగించే ఎన్నో విశేషాలు ఈ పత్రికలో ఉన్నాయని కూడా ఈ సమీక్షలో రాసాడు.[5]
1912 అక్టోబరు హిందూజన సంస్కారిణి పత్రికలో ఆంధ్ర ప్రకాశిక గురించి, "ఇది మద్రాసు నుండి వారమునకు రెండు సార్లు ప్రకటింపబడు వృత్తాంత పత్రిక. దీనికి చందా సంవత్సరమునకు 5-0-0. ఇందు రాజకీయ విషయములును ఇతర లౌకిక విషయములును చక్కగా పరిశీలించి వ్రాయబడుచుండును. ఆంధ్ర వార్తాపత్రికలలో ఇద్యే మనకు వృద్ధపత్రికయై వెలయుచున్నది" అని రాసారు. దీన్ని బట్టి అప్పటికి ప్రచురణలో ఉన్న పత్రికలలో ఇదే అత్యంత పాత పత్రిక అని తెలుస్తోంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ రాంబాబు, వేదగిరి (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: తెలుగు అకాడమి. p. 23.
- ↑ 2.0 2.1 ఇండియన్ న్యూస్పేపర్ రిపోర్ట్స్ 1868-1942.
- ↑ 3.0 3.1 రాంబాబు, వేదగిరి (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: తెలుగు అకాడమి. p. 92.
- ↑ కె.ఎన్., కేసరి (1999). చిన్ననాటి ముచ్చట్లు. చెన్నై: కేసరి కుటీరం ప్రై. లిమిటెడ్. p. 26.
- ↑ కాళిదాసు, పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య. నెల్లూరు: సొసైటీ ఫర్ సోషల్ ఛేంజ్. p. 95.
- ↑ మన్నవ, సింహాచలము పంతులు (1912). హిందూజన సంస్కారిణి. మద్రాసు: మన్నవ సింహాచలము పంతులు. p. 3.