రమేశ్ కార్తీక్ నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమేశ్ కార్తీక్ నాయక్
జననంనునావత్ కార్తిక్
14 డిసెంబర్ 1997
వివేక్ నగర్ తండా , జక్రాన్‌పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్
ప్రసిద్ధితెలుగు సాహితీకారుడు
తండ్రినుణావత్ మోజిరాం
తల్లిసేవంతా బాయి

రమేశ్ కార్తీక్ నాయక్, తెలంగాణ కు చెందిన రచయిత. ఇతను తెలుగులోనూ, ఆంగ్లంలోనూ కథలు, వచన కవిత్వం, అనువాదం వంటి విభాగాల్లో సాహిత్య సృష్టి చేశాడు. రావిశాస్త్రి కథా పురస్కారం, 2024 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారంకు ఎంపికయ్యాడు.[1][2]

రమేష్ కార్తిక్ నాయక్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన గోర్ బంజారా కుటుంబంలో జన్మించాడు. సునావత్ కార్తిక్ అన్న తన అసలు పేరును రమేశ్ అన్న మిత్రునిపై అభిమానంతో రమేశ్ కార్తిక్ నాయక్‌గా మార్చుకున్నాడు. ఇతనికి పదో తరగతిలోనే కవిత్వం రాయడం అలవాటైంది. గిరిజనుల జీవితాలు, మనస్తత్వాలు, కష్టసుఖాలు వస్తువులుగా కవిత్వం, కథలు రాయడం ప్రారంభించాడు.

జననం - బాల్యం

[మార్చు]

రమేశ్ కార్తిక్ నాయక్ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం వివేక్ నగర్ తండా (జక్రాన్ పల్లి తండా) లో నుణావత్ మోజిరాం, సేవంతా బాయి దంపతుల మొదటి సంతానంగా 1997లో డిసెంబరు 14న జన్మించాడు. వీరిది వ్యవసాయ ఆధారిత గోర్ బంజారా కుటుంబం. రమేశ్ కార్తిక్ నాయక్ అసలు పేరు నునావత్ కార్తిక్.

విద్యాభ్యాసం, ఉద్యోగం

[మార్చు]

రమేశ్ కార్తీక్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్థానికంగా చదివాడు. ఆరు నుంచి పదో తరగతి వరకు బోధన్‌లోని ప్రైవేటు పాఠశాలలో చదివాడు. బడిలో అన్ని విద్యా సంబంధిత, విద్యేతర సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు. అక్కడి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో సాహిత్యం వైపు చదవడం, రాయడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల అభీష్టం మేరకు మేడ్చల్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమాలో చేరాడు. మూడేళ్ళ డిప్లొమా పూర్తి కాకుండానే డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యావిధానంలో బిఏ పూర్తి చేసాడు. రమేశ్ కూకట్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రైవేట్‌గా ఇంటర్ హెచ్‌ఈసీ గ్రూపులో పూర్తి చేసాడు. ఎంఎన్‌ఆర్ కళాశాలలో డిఎడ్ పూర్తి చేసాడు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి స్పానిష్ భాషలో డిప్లొమా చేయాల్సి ఉండగా, ఆర్ధిక కారణాల వలన రెండో ఏడాదికి కావాల్సిన ఉత్తీర్ణత సాధించినా, కొనసాగించలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేసాడు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ చేస్తున్నాడు. 2023లో ఒక ప్రైవేట్ కళాశాలలో ఆంగ్లోపాధ్యాయుడిగా పని చేసాడు. ప్రస్తుతం దూరదర్శన్లో ఒక సాహిత్య కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు.

సాహితీ కృషి

[మార్చు]

కార్తిక్‌నాయక్‌ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రాయడం మొదలు పెట్టాడు. పదో తరగతి నుంచి కవిత్వం రాయడం అలవడింది. తన మొదటి కవితా సంపుటికి 2014లో శ్రీకారం చుట్టాడు. తను చూసిన సంఘటనలు, మనుషులతోపాటు పుస్తకాలు సేకరించి చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకొని పూర్తి చేశాడు.

గిరిజనుల జీవితాలు, మనస్తత్వాలు, సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించాడు. ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతూ కొత్త దారుల్ని వెతుకుతుంటే ‘మావాళ్లు’ ఇంకా అవే నమ్మకాల్ని గుడ్డిగా నమ్ముతూ గతంలోనే జీవిస్తున్నారని మదనపడ్డాడు. తను చూసిన బతుకుల్ని, వెతల్ని, కథల్ని కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. ఆ క్రమంలో ఇతను రాసిన ‘బల్దేర్‌ బండి’ కవితా సంపుటిని 2018లో ప్రచురణ పొందింది. 2019 జనవరిలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

రమేశ్‌ కార్తిక్‌ నాయక్‌ రాసిన మొదటి పుస్తకానికే అనేక ప్రశంసలు అందాయి. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన విద్యా సదస్సులో సన్మానం పొందారు. ఖమ్మంలో నవ స్వరాంజలి సంస్థ ఆధ్వర్యంలో సన్మానించారు. బల్దేర్‌ బండిలోని జారేర్‌ బాటి(జొన్నరొట్టెలు) అనే కవితను ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారు తెలుగు సాహిత్యంలో ఒక పాఠంగా పొందుపరిచారు.[3]

రమేశ్ కవితలు ఆంగ్లం, హిందీ, కన్నడ, మలయాళం, బాంగ్లా భాషల్లోకి అనువాదమయ్యాయి. ఢావ్లో కథాసంకలనంలోని పురుడు కథ ఆంగ్లంలోకి అనువాదమయి, ఎక్స్‌చేంజెస్ సాహిత్యానువాద జర్నల్‌లో ప్రచురితమైంది.[4]

ప్రచురించిన పుస్తకాలు

[మార్చు]
  • బల్దేర్ బండి (వచన కవితా సంపుటి) - 2018[5]
  • ‘ఢావ్లో’ కథల సంపుటి, గోర్ బంజారా కతలు - 2021[6]
  • కేసులా, తొలి గోర్ బంజారా కథలు( సహసంపాదకీయం ఆచార్య సూర్యాధనంజయ్ తో కలిసి) 2022.
  • 'చక్మక్'(Chakmak) - ఇంగ్లిష్ కవిత్వ సంపుటి - ఆగస్టు 2023

పొందిన అవార్డులు

[మార్చు]
  • యువ పురస్కార్-కేంద్ర సాహిత్య అకాడమీ (2024)[7]
  • కలహంస పురస్కారం - 2017
  • తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం ( బోధన్) - 2018
  • మువ్వా రంగయ్య ఫౌండేషన్ వారి నవస్వరాంజలి - 2019
  • చిలకమర్తి లక్ష్మీనరసింహం సాహితీ పురస్కారం - 2019
  • బీ. ఎస్. రాములు ప్రతిభా పురస్కారం - 2020
  • బంజారా యూత్ ఐకాన్ అవార్డ్ - 2021 - 2021[8]
  • రావిశాస్త్రి కథా పురస్కారం -2023[9]

పాల్గొన్న సాహిత్య సభలు

[మార్చు]

రమేశ్ అనేక సాహితీ కార్యక్రమాల్లో కవితా పఠనం చేస్తూ, లేదా వక్తగా పాల్గొన్నాడు. ఇందులో ముఖ్యమైనవి:

  1. హైదరబాద్ లిటరరీ ఫెస్టివల్
  2. ఆఖర్ దక్షిణ్ [10]
  3. బెంగుళూరు పోయెట్రీ ఫెస్టివల్

మూలాలు

[మార్చు]
  1. Nava Telangana (15 June 2024). "రమేష్ నాయక్ కార్తీక్ కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం -". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  2. EENADU (16 June 2024). "రమేశ్‌కార్తీక్‌ నాయక్‌ను వరించిన 'యువ పురస్కార్‌'". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  3. "Chakmak to throw light on Lambadas and loneliness". The New Indian Express. 2020-06-16. Archived from the original on 2022-06-16. Retrieved 2022-09-10.
  4. "The Story of a Birth". Exchanges: Journal of Literary Translation. Retrieved 14 June 2024.
  5. krishna (2019-04-25). "ఇప్పపూవులోని తేనెబిందువు 'బల్దేర్‌బండి'". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-09-10. Retrieved 2022-09-10.
  6. Mana Telangana (26 September 2021). "కథకు పట్టిన కుబుసం రాలగొట్టిన ఢావ్లో". manatelangana. Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  7. "Sahitya Akademi announces Yuva Puraskar, Bal Sahitya Puraskar winners for 2024". The Economic Times. 15 June 2024. Retrieved 15 June 2024.
  8. pratapreddy (2021-02-12). "రమేశ్ కార్తిక్ నాయక్ కు బంజారా యూత్ ఐకాన్ 2021 అవార్డ్". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2021-06-20. Retrieved 2022-09-10.
  9. వాడ్రేవు, చినవీరభద్రుడు. "రావిశాస్త్రి వారసులు". Retrieved 28 September 2023.
  10. "Aakhar Dakshin". Bangalore International Centre. Retrieved 14 June 2024.

ఇతర లింకులు

[మార్చు]