తక్కెడశిల జాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాని తక్కెడశిల (ఆంగ్లం: Johny Takkedasila) వై.ఎస్.ఆర్ జిల్లా పులివెందులలో 8 జూన్ 1991 తేదిన జన్మించారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో సాహిత్యాన్ని రచించారు. కవిత్వం, కథ, నవల, విమర్శ, అనువాదం విభాగాల్లో వీరు కృషి చేస్తున్నారు. వీరు రచించిన వివేచని సాహిత్య విమర్శ పుస్తకానికి 2023 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఈ పురస్కారానికి ప్రముఖ తెలుగు సాహితీవేత్తలు శ్రీమతి ఆవుల మంజులత, దర్భశయనం శ్రీనివాసాచార్య, వడ్డేపల్లి కృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పురస్కారమును కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాధవ్ కౌశిక్ చేతులుగా మీదుగా జాని అందుకున్నారు. [1][2].

విద్యార్హతలు  & ఉద్యోగం   

[మార్చు]

పులివెందులలోని నాగార్జున హైస్కూల్‌లో జాని తక్కెడశిల ఒకటి నుండి తొమ్మిదవ తరగతి వరకూ చదువుకున్నారు. ఎస్.బి మోమోరియల్ పాఠశాలలో పదవ తరగతిని అభ్యసించారు. లయోలా పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో చేశారు. ఆ తర్వాత అమీనా ఇనిస్టిట్యూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బి.టెక్, అలాగే శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఎంటెక్ పూర్తి చేశారు. తక్కెడశిల జాని మూడేళ్ళ పాటు పులివెందులలోని టాప్ లైన్ ఇన్స్టిట్యూట్ లో C, C++, Oracle, Hardware and Networking లాంటి కోర్సులను రెండు వేలకు పైగా విద్యార్థులకు బోధించారు. తొలుత సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన జాని తక్కెడశిల, ఆ తర్వాత ప్రతిలిపి తెలుగు విభాగాధిపతిగా కూడా సేవలు అందించారు.

ముద్రితమైన పుస్తకాలు:  

[మార్చు]

కవిత్వం

1.    అఖిలాశ

2.    విప్లవ సూర్యుడు

3.    నక్షత్ర జల్లుల్లు (కొత్త సాహిత్య ప్రక్రియ)

4.    బురద నవ్వింది

5.    మట్టినైపోతాను (యాత్ర కవిత్వ సంపుటి)

6.    గాయాల నుండి పద్యాల దాక

7.    పరక

దీర్ఘకావ్యాలు:

  1. ‘వై’ (తెలుగు సాహిత్యంలో హిజ్రాలపై రాసిన రెండవ దీర్ఘకావ్యం)
  2. ఊరి మధ్యలో బొడ్రాయి (మర్మాంగంపై రాసిన తొలి తెలుగు దీర్ఘకావ్యం)

కథా సంపుటాలు:

  1. షురూ (రాయలసీమ మాండలిక ముస్లిం మైనార్టీ కథలు)
  2. కట్టెల పొయ్యి కథా సంపుటి.

నవలలు:

  1. మది దాటని మాట (‘గే’ కమ్యూనిటీపై తొలి తెలుగు నవల)
  2. రంకు (అక్రమ సంబంధాలపై ముస్లిం మైనార్టీ తెలుగు నవల)
  3. దేవుడి భార్య (దేవదాసి వ్యవస్థపై రాసిన నవల) (పుస్తకంగా రాలేదు)
  4. జడకోపు (చెక్కభజన కళాకారుడి జీవితాన్ని ఆధారంగా చేసుకొని రాసిన నవల)
  5. చాకిరేవు (రజక కులస్తుల జీవితాల మీద రాసిన నవల)

సాహిత్య విమర్శ:

  1. వివేచని (యాభై వ్యాసాల విమర్శ సంపుటి)
  2. అకాడమీ ఆణిముత్యాలు (కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన పుస్తకాలపై వ్యాసాలు)
  3. కవిత్వ స్వరం (ఆధునిక తెలుగు కవిత్వంపై విమర్శ వ్యాసాలు)
  4. శివారెడ్డి కవిత్వం ఒక పరిశీలన

హిందీ:

  1. జిందగీ కె హీరే (నానోలు హిందీలో) నానోలను హిందీ సాహిత్యానికి పరిచయం చేసిన మొదటి పుస్తకం.

అనువాదం:

  1. 22 మంది రచయితల బాలసాహిత్య తెలుగు కథలను ఆంగ్లంలోకి అనువాదం చేశారు. Ukiyoto అనే ప్రపంచ ప్రఖ్యాత పుస్తక ప్రచురణ సంస్థ ‘Tiny Treasures’ పేరుతో ముద్రించింది. పుస్తకం యాభై దేశాల్లో లభిస్తుంది.

సంపాదకత్వం:

  1. మాతృస్పర్శ (160 మంది కవులు అమ్మపై రాసిన కవితలు)
  2. తడి లేని గూడు (కథా సంపుటం)

బాలసాహిత్యం :

  1. పాపోడు (రాయలసీమ కడప మాండలిక బాలసాహిత్య కథలు, కథలన్నీ పిల్లల సమస్యలపై మాత్రమే రాసినవి)
  2. బాలసాహిత్యంలోకి (బాలసాహిత్య విమర్శ వ్యాసాలు)
  3. బాలల హక్కులు (బాలల హక్కులపై తొలి తెలుగు బాలసాహిత్య నవల)

పురస్కారాలు :

[మార్చు]
  1. సత్రయాగం సాహిత్య వేదిక నుండి ‘కవిమిత్ర’ పురస్కారం.
  2. బాలానందం సాహిత్య సంస్థ నుండి బాలసాహిత్య పురస్కారం.
  3. చెన్నైకి చెందిన తెలుగు రైటర్స్ ఫెడరేషన్ నుండి ‘తెలుగు-వెలుగు’ పురస్కారం.
  4. ఉమ్మడిశెట్టి ఉత్తమ కవితా పురస్కారం.
  5. కలిమిశ్రీ ఉత్తమ కవితా పురస్కారం.
  6. “వై” పుస్తకానికి శ్రీమతి శకుంతలా జైని స్మారక కళా పురస్కారం-2019.
  7. ‘వివేచని’ సాహిత్య విమర్శ సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం.

అవార్డు పై విమర్శలు :

[మార్చు]

జాని తక్కెడశిలకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని ప్రకటించాక, సీనియర్ కవి, రచయిత అబ్దుల్ రజాహుస్సేన్ ఈ అవార్డుపై తన వ్యతిరేకతను కనబరిచారు. అవార్డు గ్రహీత గతంలో అనేకసార్లు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి, ఇతరుల రచనలను చౌర్యం చేశారని తెలిపారు. మహాకవి శ్రీశ్రీ కవితలతో పాటు కేంద్ర సాహితీ అకాడమీ యువ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత్రి మెర్సీ మార్గరెట్ వ్రాసిన కవితలను కూడా రచయిత కాపీ కొట్టారని ఓ ప్రకటనలో తెలిపారు. రచయిత బ్యాక్ గ్రౌండ్ పరిశీలించకుండా, అవార్డును ప్రకటించడం తగదన్నారు.

అయితే రజాహుస్సేన్ అభ్యంతరాలకు, సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు ప్రసేన్ బెల్లంకొండ స్పందించారు. "అవార్దుకు సంబంధించిన విషయం అనగానే జనరల్ కౌన్సిల్ సభ్యులుగా మృణాళిని గారు, ఎస్వి గారు అండ్ యువర్స్ ఒబీడియంట్లీ, మందలపర్తి కిషోర్ అనబడే నలుగురి పేర్లు ఎవరికైనా గుర్తుకు రావడం సహజం. కనుక ఇవాళ ఉదయం నుంచి మా పేర్లను పలు సందర్భాలలో పలువురు ఉదహరించి ఉండవచ్చు. మృణాళిని గారు కన్వీనర్‌గా మా టీం పనిచేయడం మార్చిలో మొదలైంది. ఈ యువ అవార్దు ఎంపిక ప్రక్రియ.. అంటే జ్యూరీ ఎంపిక, షార్ట్ లిస్టింగ్ వంటి కార్యక్రమాలు… అంతకు పది నెలల ముందే ప్రారంభం అయాయి, ముగిసాయి కూడా. అవార్డు ఎంపిక తేదీ నాటికి మృణాళిని గారు కన్వీనర్ కనుక జ్యూరీ సమావేశాన్ని ఫెసిలిటేట్ చేయడం అనే పనిని మాత్రం ఆవిడ పర్యవేక్షించారు. అంతకు ముందెప్పుడో జరిగిపోయిన జ్యూరీ ఎంపికలో కానీ జ్యూరీ నిర్ణయంలో కానీ మృణాళిని గారి ప్రమేయం రవ్వంత కూడా లేదు… ఉండదు. మిగిలిన ముగ్గురు జనరల్ కౌన్సిల్ సభ్యుల ప్రమేయం కూడా అసలే లేదు… ఉండదు. ఇక్కడ జ్యూరీ నిర్ణయమే ఫైనల్. కొన్ని అపార్ధాలను తుడిచెయ్యాలని ఈ వివరణ" అని తెలిపారు. [3]

మూలాలు :

  1. ABN (2023-06-24). "జాని తక్కెడశిల, చదువులబాబుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు". Andhrajyothy Telugu News. Retrieved 2024-06-25.
  2. "తక్కెడశిల జానికి యువ పురస్కారం". EENADU. Retrieved 2023-09-01.
  3. "takkedasila Archives". Muchata (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-06-25.