ఉమారుద్ర కోటేశ్వరస్వామి దేవాలయం (శ్రీకాకుళం)
ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము | |
---|---|
![]() ఉమారుద్ర కోటేశ్వరస్వామి దేవాలయం | |
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం | |
భౌగోళికాంశాలు : | 18°18′N 83°54′E / 18.3°N 83.9°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీశ్రీశ్రీ ఉమారుద్ర కోటేశ్వరస్వామి వారి దేవస్థానం |
దేవనాగరి : | उमारुद्र कोटेश्वरस्वामी देवस्थानम |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | శ్రీకాకుళం జిల్లా |
ప్రదేశం: | శ్రీకాకుళం (పట్టణం) |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | కోటేశ్వరస్వామి |
ముఖ్య_ఉత్సవాలు: | శివరాత్రి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 1 |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ.. 1774(పునఃనిర్మాణం) |
సృష్టికర్త: | బలరాముడు మగటపల్లి కామయ్యశెట్టి (పునర్నిర్మాణం) |
శ్రీ ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం పట్టణం లోని ఒక ప్రాచీన దేవాలయం.[1] ఇక్కడ కోటేశ్వరస్వామి (శివుడు) చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు.ఈ ఆలయం బలరాముడు నిర్మించిన ఆలయం అయినందున ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. శ్రీకాకుళం పట్టణంలో భాగమైన గుడివీధిలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం లోని కోటేశ్వర స్వామి ఉత్తరాంధ్ర భక్తజనకోటికి అభయప్రదాతగా విలసిల్లుతున్నారు.[2] ఈ దేవాలయం కూర్మనాథస్వామి దేవస్థానం, శ్రీకూర్మం నకు 12 కి.మీ దూరంలో ఉన్నది.[3][4]
విశిష్టత
[మార్చు]శ్లో. ఉత్తిష్ట రుద్రకోటేశ శ్రీకాకుళిష్ట శంకర!
లోకకళ్యాణ సిధ్యర్థం ! కర్తవ్యం ధర్మపాలనం!
ఈ దేవాలయం శ్రీకాకుళం పట్టణమున, నాగావళి నది ఒడ్డున గుడివీధిలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి పంచాయతన "దేవాలయం". ద్వాపర యుగాంతమున శ్రీ బలరామునిచే ప్రతిష్ఠింపజేసారు.
కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనొల్లక బలరాముడు తీర్థ యాత్రలకు బయలు దేరెను. వింధ్య పర్వతములు దాటి దండకారణ్యం అధిగమింఛి మాధవ వనములో పద్మనాభ పర్వత ప్రాంతములో నివసించుచున్నాడు. కరువు కాటకములతోను బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థింపగా అతను తన ఆయుధమైన హలము (అనగా నాగలి వలన) ని భూమిపై నాటి జలధార వచ్చినట్లుగా చేసెను. బలదేవుని ఆయుధమైన నాగావళి ఉధ్బవించినది కాబట్టి నాగావళి (దీనినే లాంగుల్య నది) అని పిలివబడుచున్నది.
అపార కరుణామూర్తి అయిన అరౌగిణయుడు "మీరు కాశీ వెళ్లనక్కరలేదు ఇక్కడికే గంగను విశ్వేశ్వరుని రప్పిస్తాను" అని భూమిపై నాగలి నాటి లాగేడు. భూమి నుండి ఒక జలధార ఉధ్బవించింది. దీనిని నాగావళి నది అంటున్నారు. ఇది త్రివేణీ తుల్యంగా సంగాం దగ్గర వెలసింది. నాగావళి (గంగ) సువర్ణముఖి (యమున), వేగవతి (అంతర్వాహిని సరస్వతి) నదుల సంగమమే త్రివేణీ సంగమంగా స్థానికంగా ప్రసిద్ధి చెందింది. బలరాముడు నాగావళి నది ఒడ్డున ఐదు శివ క్షేత్రాలను ప్రతిష్ఠ చేయించాడు అవి.
- బలరాముడు ప్రతిష్ఠించిన క్షేత్రాలు;[5]
- నాగావళి నదీ తీరమందు ఒరిస్సాలో రాయఘడ దగ్గర పాకకపాడు అను గ్రామంలో పాయకేశ్వర స్వామి దేవాలయం
- పాత్వతీపురం నకు 3 కి.మీ దూరంలో గుంప గ్రామం వద్ద సోమేశ్వర దేవాలయం
- పాలకొండ దరి సంగాం గ్రామంలో సంగమేశ్వరుని దేవాలయం
- శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వరస్వామి దేవాలయం
- కళ్లేపల్లి గ్రామంలో మణినాగేశ్వరస్వామి దేవాలయం
“ | శ్లో. నాగావళీ విమల శీకర సంప్లుతాంగం భస్మాంగలేప సమలంకృత దివ్యదేహం భక్తార్తి రోగ భవభంజన శక్తి యుక్తం కోటేశనాధమనిశాం శరణం ప్రపద్యే. |
” |
మహాశివరాత్రి పర్వదినమున ఈ పంచలింగములను దర్శించిన వారికి జన్మరాహిత్యం పాప ప్రక్షాళనము జరుగునని ప్రతీతి. శ్రీకాకుళం పట్టణంలో వెలసియున్న శివునిలో రుద్రకోటి గుణములు గోచరించుట వలన ఈ మహాలింగమును రుద్రకోటేశ్వరుడు అని నామకరణం చేసి బలరాముడు ప్రతిష్ఠించెను.
చరిత్ర
[మార్చు]శ్రీ స్వామివారిని దేవతలందరూ కూడా దర్శించుకుని వెళ్లిరి. అదే విధంగా ఈ మహాలింగమును దర్శించుటకు ఇంద్రుడు వచ్చెను. అప్పటికే కాలాతీతమైనది. పిదప నందీశ్వరుడు,శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగు సమయం కాదు అని వారించిరి. పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగెను. అపుడు నందీశ్వరుడు ఆగ్రహం వచ్చి కొమ్ములతొ ఒక విసురు వేసెను. ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడెను. ఇంద్రుడు పడిన ఆ స్థలమునే ఇంద్ర పుష్కరిణి అంటారు.[6] అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థించగా ప్రత్యక్షమై "నీవు పడిన చోట నీ వజ్రాయుధముతో త్రవ్వమని" చెప్పను. ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యభగవానుని విగ్రహం దొరికెను. అచ్చట ఇంద్రుడు దేవాలయమును కట్టి ప్రతిష్ఠించెను అదే ఈ నాటి అరసవెల్లి క్షేత్రము. అనంతరం శ్రీఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జన్మ పునీతం చేసుకొనెను.
ఈ ఆలయం సా.శ. 1774 సంవత్సరంలో కోనాడ వాస్తవ్యులు శ్రీ మగటపల్లి కామయ్యశెట్టి గారిచే నిర్మించబడింది. దీనిని 2003 డిసెంబరు 3 వతేదీన అష్టబంధన సహిత శిలాకవచం శ్రీ సద్గురు కృష్ణయాజి గారి అధ్వర్యంలో పునఃప్రతిష్ఠ జరిగింది.
నిర్మాణ శైలి
[మార్చు]ఆలయ నిర్మాణంలో ప్రాచీన వైఖరి, పవిత్ర శిల్ప విన్యాసములో మెలకువలు శాస్త్రీయ నిర్మాణ పద్ధతి గోచరిస్తున్నాయి. ఆలయం చూడటానికి వెళ్ళిన తోడనే ఎదురుగా నాగావళి మాత రుద్రకోటేశ్వరుని పాద ప్రక్షాళనమునకు చాచిన చేతుల వలే ఉత్తుంగ తరంగాలతో దర్శనం ఇస్తుంది. ఆలయం గోపురం ప్రాకారములు మనోజ్ఞములుగా ఉంటాయి. ఈ ప్రాంతం చేరే సరికి ఆ దేవుని గుడిగంటలు వీనులవిందుగా వినిపిస్తాయి. లోన ప్రవేశించునప్పటికీ సిద్ధి గణపతి దర్శనం ఇస్తాడు. తరువాత ధ్వజస్తంభం, కనబడుతుంది. శ్రీ ప్రసన్న సీతాసమేత రాముని ఎడమ తొడపై సీతమ్మవారు కూర్చున్నట్లు ఏకశిలతో దర్శనం ఇచ్చుచున్నారు. శ్రీరాముడు తన భక్తులకు ఆంజనేయస్వామిగా ఆంజనేయస్వామి భక్తులకు దర్శనం ఇచ్చుచున్నారు. ఆలయ ముఖ మంటపం చేరగానే పర్వతాకారంలో నందీశ్వరుడు మోకరిల్లుట చూస్తాం. నందిని చూసిన వెంటనే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చును. శ్రీ స్వామివారికి ఎడమ కుడి ప్రక్కల గల శృంగేశ్వరుడు, బృంగేశ్వరులను భక్తులు దర్శించుకుని లోన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర మహాలింగ మూర్తిని నిత్యాభిషేకములతో, ధూప దీప నైవేద్యములతో దర్శనం చేసుకొందురు.
ఉత్సవాలు
[మార్చు]ఈ దేవాలయానికి శివరాత్రి రోజున ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి;[7]
చిత్రమాలిక
[మార్చు]-
రాత్రి వేళలో ఆలయ దృశ్యం
-
సుప్రభాత వేశ ఆలయ ప్రాంగణం
-
ఆలయ ప్రాంగణంలోని మర్రి వృక్షంలో వలసిన గణపతి
-
నాగావళీ తీరంలో ఉన్న ఆలయ దృశ్యం
మూలాలు
[మార్చు]- ↑ "హిందూపాడ్.కాం లో ఆలయ ఉనికి". Archived from the original on 2016-03-05. Retrieved 2015-03-22.
- ↑ "శ్రీకాకుళం కలెక్టరేట్.కాం నుండి" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-03-22.
- ↑ శ్రీ కూర్మం వర్డ్ ప్రెస్ నుండి
- ↑ శైవ దేవాలయాల జాబితా
- ↑ "బలరాముడు ప్రతిష్టించిన లింగాలు". Archived from the original on 2015-01-07. Retrieved 2015-03-22.
- ↑ [ http://www.manabhakti.com/?p=3957[permanent dead link] మన భక్తి.కాం లో ఇంద్రపుష్కరిణి విశేషాలు]
- ↑ హిందూ పత్రికలో ఉత్సవాల విశేషాలు
వీడియోలు
[మార్చు]- యూట్యూబ్ లో ఉమారుద్ర కోటేశ్వరస్వామి వారి ఆలయ విశేషాలు 29th July 2013 ఈ టీవీ తీర్థయాత్రలో
- భారత్ ఛానల్ లో ఆలయ విశేషాలు
ఇతర లింకులు
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)